మన కళాశాల గురించి కొన్ని విషయాలు - విశేషాలు !
*************************
నేను 1964 -67 కాలంలో ఎలక్ట్రికల్ చదివాను.
మా మూడు ఏళ్ళు చాలా గొప్ప రికార్డ్లను చూశాము.
1) 64-65లో వనపర్తికి వరదలు!
2) 65-66లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటం చేశాం.
3) 66-67లో ఇంజనీరింగ్లో మూడవ సంవత్సరంలో డిప్లమో చదివిన వారికి ప్రవేశం కల్పించాలని పోరాటం చేశాం!
అప్పుడు,ప్రతి బస్సు కారు, లారీ మన వనపర్తి మీదుగానే ప్రయాణించేవి.
ఇక్కడ మొదట్లో మిత్రసమాజ్ అనే ఒకే ఒక అయ్యర్ హోటల్ బస్సు స్టాండుకు ఎదురుగా ఉండేది.
తరువాత మరొకరు మరో హోటల్ పెట్టారు
జగదీశ్ టాకీస్ ,శ్రీరామా టాకీస్ అనే రెండు సినిమా హాళ్ళుండేవి. భక్త ప్రహ్లాద తెలుగు, దోస్త్ హిందీ చిత్రాలు పేరుగాంచినవి అప్పట్లో!
పెద్ద హైయ్యర్ సెకండరీ స్కూలు ఉండేది !
మన కాలేజీకి ప్రవేశంలో, ఒక కమాన్ ఉండేది.
ఊళ్ళో వ్యాపార స్థలిలో మరో కమాన్ ఉండేది.
చాలా బీదవారు ఆ బజార్లోనే తిండి గింజలు కొనుక్కునేందుకు చుట్టుపక్కల ఊళ్ళ నుండి వచ్చేవారు. వ్యాపారం బాగా సాగేది.
మా రూంమ్మీట్ సాంబశివరావు ,పచ్చి నిమ్మకాయను అలా నోట్లో వేసుకొని, లడ్డూలాగా నమిలే వాడు. అది మాకు విచిత్రం !
బస్సులు ,జగదీశ్ టాకీసు మీదుగా రామా టాకీసు మీదుగా బస్సు స్టాండుకు వచ్చి, తిరిగి ఇటు కర్నూలు వెళ్ళేవి.
దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తికే ప్రాధాన్యత ఉండేది.
జిల్లా కేంద్రమైనా, మహబూబ్నగర్ చాలా బీదగా ఉండేది.
కాలేజీలో గరుడ పుష్కరిణి అనే ఒక బుగ్గ బావి ఉండేది.
దాని నీటినే అన్నింటికీ ఉపయోగించే వారు.
64-65లో ఆ బావిలో నీరు దాదాపు పై వరకు రావడం మేము చూశాం!
66-67లో అదే బావిలో నీరు గీక్కుని, మేము మా దాహార్తి తీర్చుకున్నాం.
ఇది కాలేజీ చరిత్రలో ఒక భాగం!
సాయంత్రం, రాజ ప్రసాదం పై అంతస్తు కుడివైపు రూము దగ్గరగా పెద్ద లోడ్ స్పీకర్ పెట్టి, సినిమా పాటలు వేసే వారు.
ఇంగ్లీషు కృష్ణమూర్తి గారే దాని నిర్వహణ చూసే వారు. ఆయన గాయకుడు రచయిత. ‘ కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది..‘ పాట ఆయన ప్రత్యేకత.
కాలేజీకి కుడి వైపు ఫుట్బాల్ గ్రౌండ్
దాని తరువాత లాబ్లు వర్క్షాపు, ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ క్వార్టర్స్, రాణి మహల్ హాస్టల్ ఉండేవి.
డీసీపీ మొదలయినప్పటి నుండి, అది బాలికల హాస్టల్ అయింది.
ఎడమ వైపు వాలీ బాల్ కోర్టు, యన్సిసి ఆఫీసు,స్టాఫ్ క్వార్టర్లు ఉండేవి.
రాజ ప్రసాదం కుడి వైపు ప్రిన్సిపాల్ గారి రూము, ఎడమ వైపు రాజా రామేశ్వర రావు గారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఉండేందుకు తగు వసతి ఉండేది.
వెనుక భాగంలో మరియూ రెండవ అంతస్తులో తరగతి గదులు ఉండేవి.
గ్రౌండు ఫ్లోరును “ డంజన్” అని పిలిచే వారు.
కొంత భాగం హాస్టలు, మరి కొంత భాగం ఏవేవో వస్తులను భద్రపరిచే వారు.
ప్రిన్సిపాల్ రూము వెనుక భాగంలో కోఆపరేటివ్ స్టోర్ ఉండేది. అక్కడే విద్యార్థులకు పుస్తకాలు, కావలసిన పరికరాలు, కాలేజీ వారే అమ్మే వారు.
ఈ భవనానికి వెనుక ఒక వంద గజాల దూరంలో మూడు హాస్టళ్ళు ఒక దాని తరువాత ఒకటి కట్టబడినాయి. ఈ హాస్టళ్ళ కుడి వైపున చిన్న గుట్ట లాంటిది( కొండ) ఉండేది. సీతాఫలం చెట్లు చాలా ఉండేవి. అక్కడే ఒక మోట బావి ఉండేది.
రాణి మహల్,ఏ బి సి హాస్టళ్ళలో నేను గడిపాను.
మోహన్, సుబ్బారావులు మాకు మూడేళ్ళు అన్నీ వడ్డించిన మా సర్వర్లు.
శని వారం సాయంత్రం 3 చపాతి ఆలుగడ్డ కూర బౌర్నవిటా ఒక గ్లాసు త్రాగి, లాబ్ల దగ్గర ఉన్న అసెంబ్లీ హాలులో 16యంయం ప్రోజక్టర్లో ఏదో ఒక సినిమా చూపెట్టే వారు యాజమాన్యం!
ప్రిన్సిపాల్ గారు శ్రీ రామిరెడ్డి గారు,ఏదైనా చెప్పాలనుకుంటే అందరూ ఆ హాలులో హాజరు కావలసిందే.
ప్రిన్సిపాల్ గారి రూము,క్వార్టర్ ప్రాంతంలో ఎవరూ నోరు తెరచే వారే కాదు.
విద్యార్థులకు వచ్చే ఉత్తరాలను పోస్టుమేన్ తీసుకు వచ్చి ప్రిన్సిపాల్ వెనుక నుండి మొదటి అంతస్తుకు వచ్చే మెట్ల క్రిందే,ఒక చెక్క బోర్డుకు ఉన్న ఒక జల్లెడలు గుచ్చి వెళ్ళే వాడు.
మని ఆర్డర్లు మాత్రం,ఆ క్లాసు రూముకు వచ్చి, పేర్లు చెబితే, వారు బయటకొచ్చి డబ్బు తీసుకొనే వారు. వారు ఇచ్చిన రూపాయి అర్థ సంతోషంగా తీసుకొని వెళ్ళే వాడు.
మా హాస్టల్ సర్వర్లు కూడా మాకు అన్నం వడ్డిస్తూ, “పని అయిన తరువాత వచ్చి కలుస్తా” అని రహస్యంగా చెప్పే వారు. అంటే వాళ్ళకు సినిమాకు డబ్బులు ఇవ్వమని అడగడం.
మాకు, కేవీ ( కే వేంకటేశ్వర్లు గారు) అని, అసిస్టెంటు లెక్చరర్ గారు ఉండే వారు. ఆయన ఎంత బాగా చెప్పే వారో, అంత బాగా మా బాగుగోగులు చూసే వారు. సరిగా చదవని వారిని” యూస్లెస్ ఫెలోస్! యువర్ ఫాదర్స్ ఆర్ సెండింగ్ మనీ అండ్ యు ఆర్ వేస్టింగ్ దట్” అనే పద ప్రయోగం చేసే వారు.
మా ఎలక్ట్రకల్ హెడ్ నాయుడు గారు. కృష్ణమాచారి, శ్రీనివాస్, ఆంజినేయులు ఉండే వారు
అజరయ్య అని (వర్కషాప్ టెక్నాలజీ) ఉండేవారు.
రామన్ గౌడ్, పట్టాభి మాకు యన్సిసి ఇన్చార్జిగా ఉండే వారు, వరంగంల్ ఆర్ఈసి కి కాంప్కు వెళ్ళాం!
గుప్తా బిపి మా లెక్కల మాస్టారే కాదు మా హాస్టళ్ళ ఇన్చార్జ్.
రాత్రి 8.30 వరకు నిద్ర పోరాదు. ఆయన ఎప్పుడో చెకింగ్ అని వచ్చే వారు.
రూ40/ కి విజిటేరియన్ మీల్స్ 45 రూపాయలకు నాన్ విదిటేరియన్ మీల్సు మరియూ ఉదయం ఏదో ఒక అల్పాహారం 4 ఇడ్లీ / 2 మినప అట్టు/ 2 ఉతప్పం/ 4 పూరీ/2 వడ కాఫీ
మరి ఎక్కవ అంటే 20 పైసలు ఖరీదుకు మరో రెండు వడ్డించే వారు.
మళ్ళీ సాయంత్రం కప్పు టీ.
అన్నంలో ఒక కూర పప్పు సాంబార్ రసం పెరుగు చెంచా డాల్డా ఉండేవి.
హాస్టల్లో ప్రతి ఏడాది, హాస్టల్ డే సందర్భంగా,ఈటింగ్ కాంపటీషన్ ఉండేది.
10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ ఇడ్లీలు తింటారో అనేది పందెం!
నా రూమ్మేట్ సివిల్ వెంకట్రెడ్డి రెండు సార్లు ఒక సారి 42ఇడ్లీలు 10 నిమిషాల్లో తరువాత ఏడాది పోటీలో 10 నిమిషాలు తినడం కష్టమనుకున్న మేనేజ్మెంటు వారు, 5నిమిషాలకు సమయం తగ్గించడంతో, మా ఫ్రెండే 22 ఇడ్లీలు తినడం, ప్రైజ్ సంపాదించడం జరిగింది.
బహుమతి రూ20 / ఖరీదు గల సూట్కేస్.
అతను,ఆ సూటికేస్ మన డైరెక్టర్ దాస్ గారి చేతుల మీదుగా తీసుకోవడానికి వేదిక మీదకు వస్తుంటే, ఆ కేరింతలకు దాస్ గారు కూడా చప్పట్లు కొడుతూ చాలా ప్రోత్సాహపరచడం అదొక పైద్ద విశేషం.
రాజ ప్రసాదం ముందు చాలా గొప్పగా ఏర్పాట్లను కూడా దాసు గారు బాగా మెచ్చుకున్నారు.
డైరెక్టరు గారు వనపర్తిలాంటి చిన్న కాలేజీకి రావడం కూడా ఒక రికార్డే !!
ఇంకా ఇంకా చాలా విషయాలు,విశేషాలు ఉన్నా సమయాభావం వల్ల ముగిస్తున్నాను.
ఈ సమ్ళేళనంతో, మనందరినీ, మరల మన కుర్రతనాని తీసుకు వెళ్ళిన , ఈ నిర్వాహకులకు నా శుభాకాంక్షలు.👏👏👏
నేను పని చేసి, పదవీ విరమణ చేసింది, భారత దేశంలోనే అగ్రగణ్య సంస్థ భారత భారీ విద్యత్ పరికరాల సంస్థ!
అదే ఇంగ్లీషులో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ( BHEL)
మా పిల్లలు హైస్కూలులో చదువుతున్నప్పుడు, వారు మా BHEL కు ఇచ్చిన నిర్వచనం.
Be Happy Enjoy Life !
మా కాలేజీని, మా సంస్థను ఈ క్షణంలో తలచుకోవడమే నాకు గర్వకారణం!
🙏ఒకటి చదువు నేర్పితే, మరొకటి జీవితాన్నే సఫలం చేసింది 🙏
కోవిడ్ కాలంలో మేము మరో H కలిపాం
Be Happy Healthy Enjoy Life !
అదే మన తెలుగులో
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి !!
గోపాలకృష్ణ వఝ 64E
బిహెచ్ఈయల్,
హైదరాబాదు-32.
9490191543
Registered Alumni
Membership No.
KDR496-64E
వనపర్తి కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల మా సరస్వతి నిలయం
మనోహర్ దురిశెట్టి, 81- 84 EE, KDRGP-ALUMNI
ఏడీఈ/ఆపరేషన్, TSNPDCLమెటుపల్లి. గారి మధురానుభవ జ్ఞాపకాలు.
******
వనపర్తి కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల మా సరస్వతి నిలయం
******
నా జీవిత పుస్తకంలో అందమైన పేజీలు, మధురమైన జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఏమున్నాయని ఒక్క వాక్యంలో చెప్పుమని ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే నేను నిస్సందేహంగా చెప్పే జవాబు ఒకటే..
అవి వనపర్తిలో 1981 నుండి 84 వరకు మూడేళ్లు గడిపిన రోజులని చెబుతాను.
ఒక మారుమూల పల్లెటూర్లో పుట్టి పెరిగిన నాకు మొదటిసారి అక్టోబర్, 1981 లో వనపర్తి కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చదవడానికి అడుగు పెట్టినప్పుడు ఒక అద్భుత లోకంలో ప్రవేశించిన అనుభూతి నాకు కలిగింది. రాజులు కట్టిన అద్భుతమైన రాజప్రాసాదము లో అందులో తరగతులు మరియు అత్యంత శుభ్రమైన హాస్టల్ గదులు, మెస్సు తదితర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కాలంలో ఐఐటీ స్థాయికి తగ్గట్టుగా ఉండేవి. ఈ కాలేజీలో చదవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇక్కడ నేర్చుకున్న చదువు, గురువులు నేర్పిన క్రమశిక్షణ, సంస్కారం నాకు పట్టా తీసుకొని బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో ఒక మంచి ఉద్యోగం.. దాని ద్వారా నా కుటుంబానికి ఒక జీవనాధారం లభించి ఈరోజు సమాజంలో నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికి కారణం అయింది.
కాలేజీ వదిలి బయట ప్రపంచంలోకి అడుగుడిన 43 ఏళ్ల తర్వాత కూడా వనపర్తి తో నాకున్న అనుబంధం, అనుభవించిన మధుర క్షణాలు ఇంకా చిక్కగా నా స్మృతి పధం లో నిత్యం మెదులుతూనే ఉంటాయి. జ్ఞాపకం వచ్చిన ప్రతీక్షణం నా రక్తనాళాల్లో ఒక శక్తి, నా ముఖంలో చిరునవ్వు వాటంతటవే వస్తుంటాయి. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ లో నేర్చుకున్న ప్రతిదీ నన్ను రోజువారి జీవితంలో నిత్య విద్యార్థిగా నిలబెట్టింది.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా నా మనోఫలకం పై ముద్రించబడిన కొన్ని ముఖ్యమైన జ్ఞాపకాలని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
మంచి గురువులు:
కాలేజీలో మంచి గురువులు దొరకడం నా అదృష్టంగా భావిస్తాను. ప్రిన్సిపల్ వై.ఎ.శర్మ సర్, ఎలక్ట్రికల్ హెచ్ఓడి సుబ్బారావు సర్, కృష్ణమాచారి సర్, శ్యామ్ సుందర్ రెడ్డి సర్, నర్సింలు సర్, మల్లేశం సర్, రాంభూపాల్ శెట్టి సర్, మల్లప్ప రాజు సర్, బాలకృష్ణ సర్.. ఇలా ప్రతి ఒక్కరు తమ సబ్జెక్టుల్లో నిష్ణాతులు. వారు చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. వారి రుణం తీర్చుకోలేనిది.
అందులో కొద్ది మంది గురువులను ఫోన్ లో తరచూ పలకరిస్తూ ఉంటాను.
సినిమాలు:
చదువుతోపాటు ఇతరత్రా వ్యాపకాలు అంటే వనపర్తి లో ఎన్నో సినిమాలు చూసిన జ్ఞాపకం. అలనాటి బ్లాక్ బస్టర్ మూవీలు దేవత, కొండవీటి సింహం, త్రిశూలం, సీతాకోకచిలుక.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో..
ఇక థియేటర్లు శ్రీరంగ, బృందావన్, శ్రీరామ బాగా జ్ఞాపకం.
పరీక్షలు:
పరీక్షలు అంటే మాకు ఎల్లప్పుడూ ఒత్తిడే! ఎప్పటి పాఠాలు అప్పుడు చదవకపోవడం, పరీక్షలు ఇంకో పది రోజులు ఉన్నాయనగా గుట్టలాంటి సిలబస్ ను ముందర వేసుకొని తిప్పలు పడడం, అర్ధరాత్రి వరకు చదువుతూ నిద్ర వస్తే నల్లమల, నగరి ఎక్స్ప్రెస్ లు వెళ్లే సమయం లో బస్టాండ్ దగ్గర హోటల్లో చాయ్ లు తాగి హాస్టల్ కు రావడం, పరీక్షలు రాయడం పాస్ కావడం.. ఇలా మూడేళ్లు గడిపాము. మొత్తానికి డిస్టింక్షన్ లో పట్టా సాధించాము.
ర్యాగింగ్:
కాలేజీలో చేరిన మొదటి పది రోజులు రాత్రి అయిందంటే హాస్టల్లో సీనియర్లు అంటే ఎంతో భయంగా ఉండేది. మా క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరం ర్యాగింగ్ బారిన పడిన వాళ్ళమే. కానీ తదుపరి మమ్మల్ని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా తమ్మి.. అని పిలిచి అన్నిట్లో సాయం చేసేవారు. మేము రెండవ సంవత్సరంలో అడుగుపెట్టాక మా జూనియర్లను ర్యాగింగ్ చేయలేదు.
1982 ఏషియన్ గేమ్స్:
ఫైనల్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ రెడ్డి మెస్ లో బయట అమర్చిన డయనోరా బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసిన జ్ఞాపకం. ఆ మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోవడం కొసమెరుపు.
సాంస్కృతిక కార్యక్రమాలు:
కాలేజీలో చేరిన తొలి సంవత్సరం 1981లో ఆడిటోరియంలో మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ సర్ మ్యాజిక్ షో, గ్రౌండ్లో ప్రదర్శించిన రక్త కన్నీరు నాగభూషణం గారి నాటకం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతాయి.
విద్యార్థి సంఘం ఎన్నికలు :
మేము రెండవ సంవత్సరం లో ఉండగా మా రూమ్మేట్ మనోరంజన్ రెడ్డి ని జనరల్ సెక్రటరీగా పోటీ చేయించాము. రెండు వారాలు కాలేజీలో, హాస్టల్లో మంచి ప్రచారం నిర్వహించి ఘన విజయం సాధించాము. అప్పటి మా ప్యానల్ లో పూర్ణచందర్ ప్రెసిడెంట్! ఏ -హాస్టల్ మెట్ల దగ్గర ఇండియన్ ఇంకుతో నేను రాసిన ఎలక్షన్ వాల్ రైటింగ్ మూడేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంది.
హాస్టల్:
హాస్టల్ మరియు మెస్ గురించి చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అంతటి అద్భుతమైన సదుపాయాలు లేకుండేవి. విశాలమైన హాస్టల్ గదులు, ప్రతి రూంకు ముగ్గురు లేదా నలుగురు ఉండేలా వసతి ఎంతో బాగా ఉండేది. మెస్ లో ఎంతో రుచికరమైన భోజనం. మెస్ సెక్రటరీగా ఏడాదిన్నర పాటు నా రూమ్మేట్ రాందాస్ ఉండేవాడు. అందువల్ల మెస్సులో మాకు మరింత స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది.
వనపర్తి ముచ్చట్లు:
వనపర్తి గురించి చెప్పాలంటే మూడేళ్ల పాటు ఆ ఊరితో మమేకమై జీవించాము. అక్కడి ప్రతి అంగుళం మాకు కొట్టిన పిండి. ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక రోడ్డు వైపు వాకింగ్ వెళ్లే వాళ్ళం. ఊర్లో షాపింగ్ ఇతర అవసరాలకు తిరిగేవాల్లం. ప్రతి సాయంత్రం ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ లో ఒక దోస తిని కమ్మటి చాయి తాగేవాళ్ళం.
క్లాసికల్ టైలర్ వద్ద ఉప్పర్ మీటింగ్ లు, హిందుస్థాన్ బిర్యాని, మెట్రో, రెడ్డి మెస్ లలో భోజనం, మనీ ఆర్డర్ కొరకు హెడ్ పోస్ట్ ఆఫీస్ కు వెళ్లడం, కొత్తకోట రోడ్డు, రాజనగరం తోట, రాణీ లక్ష్మీ దేవమ్మ డిగ్రీ కాలేజీ, పెబ్బేర్ రోడ్డు, సరళ సాగర్ పిక్నిక్, జడ్చర్ల దగ్గర ఊర్లో మా సీనియర్ రఘునందన్ చెల్లెలి పెళ్లికి సైకిల్ పై వెళ్లడం, అచ్చంపేటకు మా గురువు శ్యాంసుందర్ రెడ్డి సర్ పెళ్లికి వెళ్లడం, జ్వరం వస్తే డాక్టర్ చలమా రెడ్డి గారి దవాఖానకు వెళ్లడం.. ఇలా నా మదిలో వేలాది జ్ఞాపకాలు ఇప్పటికీ ముద్రించబడి ఉన్నాయి.
మహాకవి శ్రీ శ్రీ గారికి సన్మానం:
1982 లో వనపర్తి వాస్తవ్యులు కవి, రచయిత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య గారు మహాకవి శ్రీశ్రీని ఆహ్వానించి వనపర్తి జూనియర్ కాలేజీలో పౌర సన్మానం చేయడం, శ్రీశ్రీ గారికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం, ఆ మహాకవిని కనులారా వీక్షించడం ఒక అద్భుతమైన ఘట్టం.
109 రోజుల నిరవధిక సమ్మె:
డిప్లమా చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లో చేరాలంటే ఆనాడు ప్రత్యేకమైన ఎంట్రీ లేదు. ప్రతిభ ఉండి, ఉన్నత చదువులు చదవాలని ఉన్న డిప్లమా విద్యార్థులకు ఇలాంటి అవకాశం లేకుండేది. వీటిని అధిగమించడానికి రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు మొత్తం మెరుపు సమ్మెకు దిగడం జరిగింది. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ అధ్యక్ష కార్యదర్శులు టైటస్, పురుషోత్తం లు స్టీరింగ్ కమిటీగా ఏర్పడి 109 రోజులు నిరవధిక సమ్మె చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి డిప్లమా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ లో రెండవ సంవత్సరం ల్యాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు కల్పించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాల్లో ఇదొక గొప్ప మలుపుగా చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయింది. ఈ సమయంలో మా చదువు మూడున్నర సంవత్సరాలు కొనసాగింది. మేము ఒక విద్యా సంవత్సరం నష్టపోయాము. అయినా ఒక రికార్డు సృష్టించాము అన్న భావన మా మనసుల్లో నిలిచిపోయింది.
31.10.1984, భారత ప్రధాని హత్య :
ఆరోజు ఉదయం పూట తరగతులు కాగానే హాస్టల్ కు వచ్చి మా A-3 రూమ్ లో ఫ్రెషప్ అయ్యాము. అప్పుడు ఏదో కారణం వల్ల మెస్ మూతపడి ఉండెను. నేను నా రూమ్మేట్స్ మనోరంజన్ రెడ్డి, రాందాస్ మరియు మిగతా మిత్రులు రెడ్డి మెస్ లో భోజనం చేసి వస్తున్నాము. దాదాపు మధ్యాహ్నం 1.30 కావస్తోంది. మన కాలేజీ అర్చి ముందరికి రాగానే ఎవరో ప్రధాని ఇందిరాగాంధీని చంపారు అని మాట్లాడుకుంటున్నారు. వెంటనే మేము మిత్రుడు నరేష్ ఇంటికి బీసీ రెడ్డితో కలిసి వెళ్లి రేడియోలో వార్తలు విన్నాము. అందులో భారత ప్రధాని ఇందిరాగాంధీని తన అంగరక్షకులే కాల్చి చంపారు అని చెప్పారు. ఎంతో బాధగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు బస్టాండ్ కి వెళ్లి న్యూస్ పేపర్ కోసం వేచి చూడగా అక్కడో పెద్ద లైన్ ఉంది. ఎలాగోలా ఈనాడు పేపర్ దొరికింది. అందులో పతాక శీర్షిక నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది..
'ప్రధాని ఇందిర దారుణ హత్య'.
1983 క్రికెట్ వరల్డ్ కప్:
1983 జూన్ లో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ స్టేడియం లో ఇండియా గెలుపును రేడియో కామెంట్రీ ద్వారా విని ఎంజాయ్ చేసి ఆ రోజు అర్ధరాత్రి వనపర్తి రోడ్లమీద డాన్స్ చేశాము. నా రూం లో స్పోర్ట్స్ స్టార్ సెంటర్ స్ప్రెడ్ కపిల్ దేవ్ బౌలింగ్ పోస్టర్ అతికించాను. దానిపై క్యాప్షన్..
కపిల్ దేవ్.. ఇండియాస్ ఇయాన్ బోతం!
ఎన్టీఆర్ పదవీచ్యుతి:
1984 లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని అప్పటి గవర్నర్ రామ్ లాల్ పదవి నుంచి తొలగించి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా చేస్తే నెల రోజులపాటు రాష్ట్రం అట్టుడికి పోయింది. ఎమ్మెల్యేలందరూ ఆనాడు వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గార్ల ఆధ్వర్యంలో కర్ణాటక నంది హిల్స్ లో క్యాంపు నిర్వహించటం మళ్లీ కేవలం నెల రోజుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం ఇప్పటికి బాగా గుర్తు. మెస్ లో వచ్చే హిందూ పేపర్ ద్వారా రోజువారి విషయాలు తెలుసుకున్నాము. మాకు ఇంగ్లీషు భాష కూడా ఇంప్రూవ్ అయింది.
1984 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్:
1984 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ కూడా ప్రతీ రోజు కాలేజీ లైబ్రరీలో వార్తలు చదివి ప్రతి ఆట గురించి తెలుసుకున్నాము. ఆ ఒలింపిక్స్ లో రష్యా పాల్గొనలేదు. పథకాల పట్టికలు మన దేశం అధమ స్థానంలో ఉంది. మా రూం లో ఒలింపిక్స్ లోగో ఆర్ట్ వేశాను.
మిత్రబృందం - ఎన్నో జన్మల బంధం :
వనపర్తి లో నాకు లభించిన క్లాస్మేట్స్ అద్భుతం. కళాశాల బయటకు వచ్చి 40 ఏళ్ళైనా ఇంకా మా స్నేహం చిక్కగా కొనసాగుతూనే వుంది. 13మంది మిత్రులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో సెటిల్ అయ్యారు. దాదాపు 7గురు విద్యుత్ రంగంలో ఉన్నాము. అందులో బీసిరెడ్డి మా డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర రథ సారథి గా 20 ఏళ్ల నుండి కొనసాగుతున్నారు. హసన్, మురళి కృష్ణ, నేను, మనోరంజన్ రెడ్డి, నరేష్, ప్రభాకర్, వెంకటేష్ ఎలక్ట్రికల్ ఇంజినీర్లు గా, కృపామని ఆస్ట్రేలియా లో, రాందాస్ గొప్ప ఎనర్జీ కన్సల్టెంట్ గా, రాజు బిజినెస్ మాన్ గా, రవిప్రకాష్ సివిల్ ఇంజినీర్ గా, స్వామి ఆర్టీసి లో సెటిల్ అయ్యారు. మా జీవిత గమనానికి దిక్సూచి నిస్సందేహంగా కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ అని చెపుతాను.
65 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాలేజీ-పూర్వ విద్యార్థుల సమ్మేళనం 28.01.2024
65 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ వేలాదిమంది ప్రతిభావంతులైన డిప్లమా ఇంజనీర్లను ఉత్పత్తి చేసి జాతికి అందించింది. ఈ సందర్భంగా..
మరో వారం రోజుల్లో వనపర్తి గడ్డపై కాలుమోపాలని..
గురువుల పాదాలు తాకాలని..
సీనియర్లకు వందనం చేయాలని..
మిత్రులను గుండె నిండా హత్తుకోవాలని..
నా క్లాస్ రూమ్ లో ఒకసారి కూర్చోవాలని..
హాస్టల్ రూమ్ చూడాలని..
కళాశాల ఆవరణలోని మట్టిని కొంచెం మూట కట్టుకొని మా ఊరికి తీసుకొని పోవాలని..
వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా..
ఈ సమ్మేళనం
గోల్డెన్ జూబిలీ కాదు..
డైమండ్ జూబిలీ కాదు..
కానీ నా దృష్టిలో
సెంటెనరీ సెలబ్రేషన్!
అదే
శతాబ్ది ఉత్సవం!!
అందుకే..
కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల నా గుండె చప్పుడు!!
నా అభిమాన దేవాలయం..
నాకో మంచి జీవితాన్నిచ్చిన కాంతి రేఖ!
జై కేడీఆర్జీపి.
మనోహర్ దురిశెట్టి,
KDRGP-ALUMNI
81-E బ్యాచ్
ఏడీఈ/ఆపరేషన్,
TSNPDCL
మెటుపల్లి.
🙏
కె డి ఆర్(వనపర్తి) పూర్వ విద్యార్థుల సమ్మేళనం....
అపూర్వ కలయికకు ఆరంభం...
ఛత్రపతి శివాజీ పిలిచెను...మా అడుగులు ముందుకు వేయమని..చదువుకున్న కళాశాల ఆవరణలో...
విద్యార్థులే లెక్చరర్లు... ఆ లెక్చరర్లే మళ్ళీ (పూర్వ)విద్యార్థులు గా...
గురువులకు వందనాలు...గురువు.. గురువులకు పాదాభివందనాలు...
దుషాలువాలతో ఆత్మీయ సన్మానాలు...
సీనియర్లు.... చిలుకూరి హన్మంత్ రావ్ ,కుమారస్వామి, తైలం శంకర్ ప్రసాద్ ల నిరంతర కృషి...
వెయ్యి మంది సీనియర్, జూనియర్ ల సంగమం...
ప్రేమాభిమానంతో ఆలింగనం...
కె డి ఆర్ మట్టిని... మూట గట్టిన దురిశెట్టి...
మట్టి మూఠపై...మదురస్మృతులు వినిపించే..
అల్యూమినికి....స్పాన్సర్ల అండ..
అట్టహాసంగా... కార్యక్రమ నిర్వహణ...
ఆరు దశాబ్దాల పూర్వ విద్యార్థుల కలయిక...ఏ అలకలు లేకుండా..లుకలుకలు అంత కన్న లేకుండా...
అదే కె డి ఆర్ విద్యార్థుల ఉన్నతి..
విజయ సోపానాలకు అభ్యున్నతి..
కలెక్టర్ నోట కె డి ఆర్ మాట...
ఆరు పదుల వయస్సులోను....
ఇరవై ఐదే మరి....చూడ ముచ్చటగా అన్యోన్యత.. ఆప్యాయత...
వేదిక పై చారి (97)వ్యాఖ్యానం...
బ్యాచ్ ల వారీగా ఫొటో సెషన్ లు..
అతిధులకు జ్ఞాపికలు...
రిజిస్టర్డ్ మెంబర్లకు స్వాగత కిట్లు...
ఉదయం అల్పాహారాలు...
మధ్యాహ్నం భోజనాలు...మెట్రో హోటల్ ను ఎలా మరిచేరిక...
అన్ని సన్నివేశాలను బందించెను మా ఫోటో,వీడియో గ్రాఫర్ అన్నలు..
ఈ ఒక్క రోజే కన్నులకు విందుగా...
కళాశాల కు వచ్చెను పూర్వ వైభవం..
పోవాలి..అనిపించే...మా పూర్వ విద్యార్థులకు...కళాశాల తరగతి గదులకు, వర్క్ షాప్ కి,కంప్యూటర్ హాళ్లకు,మెస్ హాస్టల్ కి,ర్యాగింగ్ అడ్డా వేప చెట్టు కాడికి, నాటి సినిమా హాళ్లకు..
బ్రెడ్ తో కడుపు నింపిన బేకరీలకు...
ఆర్టీసీ బస్ స్టాండ్ లకు...
ఏ, బి,సి హాస్టళ్లకు...
జూనియర్ లను ర్యాగింగ్ చేయ నాడు సీనియర్లు...
నేడు సీనియర్లను స్వాగతించే జూనియర్ లు ఆకు పచ్చని తోరణాలతో...
మళ్ళీ ఎప్పుడు కలిసేనో ఈ విద్యార్థులు అంతా...
కలవాలి ఎప్పుడా ...అన్న ఆతృత మాలో...
ఎన్నో రాష్ట్రాల్లో ఉద్యోగులు గా ఉన్నా... రిటైర్మెంట్ అయ్యి ..ఆరోగ్యం సహకరించకున్నా...
బిడ్డలు,మనుమలు,మనుమరాళ్లతో మా కళాశాల రండి అని..తోడు తెచ్చుకున్న ...మన పూర్వ విద్యార్థులు మరెందరో..వేల కిలో మీటర్ల ప్రయాణం..వ్యయా ప్రయాసాలకు ఓర్చి...విలువైన సమయాల్ని కేటాయించి అందరితో ముచ్చటించిన మా పూర్వ విద్యార్థులoదరికి వందనాలు...గురువులకు పాదాభివందనాలు....
✍️✍️✍️✍️మీ ధబ్బేటి సోంబాబు గౌడ్
1997-2000 మెకానికల్
మోత్కూర్, యాదాద్రి భువనగిరి జిల్లా
9959246299
అపూర్వ కలయికకు ఆరంభం...
ఛత్రపతి శివాజీ పిలిచెను...మా అడుగులు ముందుకు వేయమని..చదువుకున్న కళాశాల ఆవరణలో...
విద్యార్థులే లెక్చరర్లు... ఆ లెక్చరర్లే మళ్ళీ (పూర్వ)విద్యార్థులు గా...
గురువులకు వందనాలు...గురువు.. గురువులకు పాదాభివందనాలు...
దుషాలువాలతో ఆత్మీయ సన్మానాలు...
సీనియర్లు.... చిలుకూరి హన్మంత్ రావ్ ,కుమారస్వామి, తైలం శంకర్ ప్రసాద్ ల నిరంతర కృషి...
వెయ్యి మంది సీనియర్, జూనియర్ ల సంగమం...
ప్రేమాభిమానంతో ఆలింగనం...
కె డి ఆర్ మట్టిని... మూట గట్టిన దురిశెట్టి...
మట్టి మూఠపై...మదురస్మృతులు వినిపించే..
అల్యూమినికి....స్పాన్సర్ల అండ..
అట్టహాసంగా... కార్యక్రమ నిర్వహణ...
ఆరు దశాబ్దాల పూర్వ విద్యార్థుల కలయిక...ఏ అలకలు లేకుండా..లుకలుకలు అంత కన్న లేకుండా...
అదే కె డి ఆర్ విద్యార్థుల ఉన్నతి..
విజయ సోపానాలకు అభ్యున్నతి..
కలెక్టర్ నోట కె డి ఆర్ మాట...
ఆరు పదుల వయస్సులోను....
ఇరవై ఐదే మరి....చూడ ముచ్చటగా అన్యోన్యత.. ఆప్యాయత...
వేదిక పై చారి (97)వ్యాఖ్యానం...
బ్యాచ్ ల వారీగా ఫొటో సెషన్ లు..
అతిధులకు జ్ఞాపికలు...
రిజిస్టర్డ్ మెంబర్లకు స్వాగత కిట్లు...
ఉదయం అల్పాహారాలు...
మధ్యాహ్నం భోజనాలు...మెట్రో హోటల్ ను ఎలా మరిచేరిక...
అన్ని సన్నివేశాలను బందించెను మా ఫోటో,వీడియో గ్రాఫర్ అన్నలు..
ఈ ఒక్క రోజే కన్నులకు విందుగా...
కళాశాల కు వచ్చెను పూర్వ వైభవం..
పోవాలి..అనిపించే...మా పూర్వ విద్యార్థులకు...కళాశాల తరగతి గదులకు, వర్క్ షాప్ కి,కంప్యూటర్ హాళ్లకు,మెస్ హాస్టల్ కి,ర్యాగింగ్ అడ్డా వేప చెట్టు కాడికి, నాటి సినిమా హాళ్లకు..
బ్రెడ్ తో కడుపు నింపిన బేకరీలకు...
ఆర్టీసీ బస్ స్టాండ్ లకు...
ఏ, బి,సి హాస్టళ్లకు...
జూనియర్ లను ర్యాగింగ్ చేయ నాడు సీనియర్లు...
నేడు సీనియర్లను స్వాగతించే జూనియర్ లు ఆకు పచ్చని తోరణాలతో...
మళ్ళీ ఎప్పుడు కలిసేనో ఈ విద్యార్థులు అంతా...
కలవాలి ఎప్పుడా ...అన్న ఆతృత మాలో...
ఎన్నో రాష్ట్రాల్లో ఉద్యోగులు గా ఉన్నా... రిటైర్మెంట్ అయ్యి ..ఆరోగ్యం సహకరించకున్నా...
బిడ్డలు,మనుమలు,మనుమరాళ్లతో మా కళాశాల రండి అని..తోడు తెచ్చుకున్న ...మన పూర్వ విద్యార్థులు మరెందరో..వేల కిలో మీటర్ల ప్రయాణం..వ్యయా ప్రయాసాలకు ఓర్చి...విలువైన సమయాల్ని కేటాయించి అందరితో ముచ్చటించిన మా పూర్వ విద్యార్థులoదరికి వందనాలు...గురువులకు పాదాభివందనాలు....
✍️✍️✍️✍️మీ ధబ్బేటి సోంబాబు గౌడ్
1997-2000 మెకానికల్
మోత్కూర్, యాదాద్రి భువనగిరి జిల్లా
9959246299